రాణి-దాసీ

                                   

రాణీ, దాసీ అక్కడక్కడా పాచి పట్టి,కొండ రాళ్ళ మధ్యని పిచ్చిమొక్కలు మొలిచి,సగం కూలిన కోట మీద నిలబడి దూరంగా కనబడున్న పొలాలని,ఇళ్ళనీ చూస్తూన్నారు. అలవాటైన కాలక్షేపం.
 రాణి ముసలిది. 
దాసి ముసలిది. 
రాణి తల్లి రాణి. 
దాసి తల్లి దాసి. 
దాసి తల్లి రాణి తల్లికి దాసి.
 పాట ఒకటి పొలాల మీదుగా తేలుతూ  వచ్చింది.

ఏరువాకమ్మకి ఏమికావాలి? 
ఎర్రఎర్రని పూలమాల కావాలి 
ఎరుపుతెలుపుల మబ్బుటెండ కావాలి 
ఏరువాకమ్మకి ఏమి కావాలి? 
పొలము గట్టున నిలిచి వేడుకోవాలి 
టెంకాయ వడపప్పు తెచ్చిపెట్టాలి 

రాణికి పెళ్ళి అయినప్పుడు రాణితో బాటు ఈ రాజ్యానికి వచ్చింది దాసి.
రాణీ గారి ఏడు వారాల నగల మిసమిస,రాజావారి ఠీవీ చూసి ఏడ్చిపోయింది దాసి. 
తన లేమితనానికి కుమిలిపోయింది. 
అప్పుడు దానికింకా పెళ్ళి కాలేదు. 

చక్కని గుంటా- రాయే నా ఎంటా 
సరసన కూచుంటా -పెళ్ళి సేసుకుంటా 
గుర్రాన్నెక్కిస్తా -కూడా నేనొస్తా 
సర్రూన ఊరంత -సైదిరిగి వత్తాము 

అని రాజు గారి భటుడొకడు దాన్ని చూసి పాట పాడేడు.
 ఆనక పెండ్లాడేడు. 
పెళ్ళాడాక దాని మనసు కొంత కుదుటపడింది.

రాజా వారు వేశ్యల చుట్టూ తిరుగుతూ రాణిని పట్టించుకోలేదు. 
అప్పుడు దాసీది,దాని మొగుడిదీ అన్యోన్యతను చూసి రాణీ ఈర్ష్య పడింది. 
తన దురదృష్టానికి కుమిలిపోయింది. 

రాణీకి పండంటి బాబు పుట్టాడు.

 చిక్కుడూ పువ్వెరుపు చిలుక ముక్కెరుపు 
చిగురెరుపు చింతల్ల దోరపండెరుపు 
రక్కిస పండెరుపు రాగి చెంబెరుపు 
రాచవారిళ్ళలో మాణిక్యమెరుపు 
తానెరుపు అబ్బాయి తన వారిలోన

 అని పాడింది రాణి.
 
దాసీకి పండంటి బాబు పుట్టాడు.

 ఏటి గట్టూ మీద కరివేప చెట్టు 
గాలివానా వచ్చి కొమ్మలల్లాడే
 కొమ్మలల్లాడెనే గొలుసులల్లాడె 
కొనికొన్ని ముత్యాల చేరులల్లాడె 
ఆ చెట్ల పైనుండి అబ్బాయి రాగ 
బంగారు తలపాగ చెంగులల్లాడె

అని పాడింది దాసి. 

రాణి కొడుకు యువరాజు అయ్యాడు. 
దాసి కొడుకు భటుడయ్యేడు. 

ఇంతలో ముష్కర మూక రాజ్యం మీదికి దండెత్తి వచ్చింది. 

యుద్ధానికి బయలుదేరి వెళ్ళిన ముసలి రాజు,పడుచు యువరాజు యుద్ధ భూమిలో మరణించారు.
 యుద్ధానికి బయలుదేరి వెళ్ళిన ముసలి భటుడు,పడుచు భటుడు యుద్ధ భూమిలో మరణించారు. 

ముష్కర మూక సంపదంతా దోచుకుంది. 
కనిపించిన వారినల్లా చంపివేసింది. 
నేల మాళిగలో దాక్కున్న రాణి,దాసి బతికిపోయారు. 

సంపద,రాజ్యము,అయినవారు,భర్త,కొడుకు అంతాపోగా పొగిలి పొగిలి ఏడ్చింది రాణి. 
భర్త,కొడుకు పోగా కుమిలి కుమిలి ఏడ్చింది దాసి.

ఇక అప్పటినించీ రాణీ,దాసీనే కోటకంతా. 
పాత రాణి మీద గౌరవంతో రైతులు తెచ్చిచ్చే అయివేజుతో రోజులు గడుపుతోంది రాణి. 
మరో నలభై ఏళ్ళు గదిచిపోయాయి.ప్రభుత్వాలు మారాయి. తరాలు మారాయి.

అయినా రాణి రాణే.దాసి దాసే.    
బీదరికంలోనూ,చుట్టూ ఎవరూ లేకున్నా,రాణి రాణే. దాసి దాసే.

రాణి తన రాణితనమంతా దాసి మీద చూపించేది. చిన్న పనీ పెద్ద పనీ చెబుతూ నిలబడనీక,కూర్చోనీక సతాయించేది.దాసికి ఎప్పుడూ ఏదో ఒక పనిని సృష్టించడమే రాణి పని.గిన్నెలు సరిగ్గా తోమలేదని,బూజులు సరిగ్గా దూలపలేదని,నీళ్ళు వేడిగా కాచలేదని, అన్నం పలుకులుగా ఉందని,కాళ్ళు సరిగ్గా పట్టలేదని ఇలా ఎప్పుడూ అరుస్తూ ఉండేది రాణి.       
దాసి కి రాణిని గొంతు పిసికి చంపాలన్నంత కోపం వచ్చేది.కానీ రాణి పోతే తన బతుకు?అందుకని రాణిని తిట్టుకుంటూ,గొణుక్కుంటూ పని చేసుకుంటూ  ఆ శిధిల కోటలో తిరుగుతూ ఉండేది దాసి.             

దాసి వంట గదిలో ఏమరుపాటుగా ఉంటే కోట బురుజుల మీద యధేచ్ఛగా తిరిగే కోతులు వంటిట్లోకి దూరి అరటి పళ్ళు,గరిటెలు,పళ్ళాలు ఏవి కనిపిస్తే అవి ఎత్తుకుపోయేవి.
దాసీది కేకలు వేసేది,కర్ర పెట్టి అదిలించబోయేది.అవి దూరంగా పోయినట్టే పోయి పళ్ళన్నీ బయటపెట్టి దాసీని వెక్కిరించేవి.

నాగుబాములు,పసరిక పాములు హాయిగా చుట్టలు చుట్టుకుని పడుకునేవి బురుజుల్లో. కోటలోకీ వచ్చేసేవి తోచినప్పుడల్లా.ముఖ్యంగా ఎండాకాలంలో. ఎండలు మండిపోతున్నప్పుడు చల్లగా వచ్చేసేవి .
అప్పుడు దాసి పాడేది .
         
 ఉసిరిక చెట్టు కింద పసిరిక పాము 
కూసమూడ్చీ పాము పడగ  బుస్సంది 
పాము నన్నూ చూచి పడగనెత్తింది 
పడగలెత్తకు పాము పగవారము కాము 

రాణీ గదిలో పాము పడగెత్తి ఉంటే రాణి పాడేది.

నాలుకలు దూయకే నీవారము నాగూ 
మంచి నాగూవైతె పంచెలెట్టేము
కోడె నాగూవైతె కోకలెట్టేము 
పడగలెత్తకు పాము పగవారము కాము

తుఫాన్లకి ,జడివానలకి మరింత శిధిలమైంది కోట.     
పావురాళ్ళ కువకువలతో కోట కోటంతా నిండిపోయేది.
రాణికి,దాసికి నిద్ర పట్టేది కాదు. 

రాణి పోతే తన బతుకు ఎలాగో అని దిగులు పడేది  దాసి. 
ఈ రాణి తన నగలు ఎక్కడ దాచిందో ఈ నలభై ఏళ్ళల్లో కనిపెట్టలేకపోయింది. 
రాణీ, తాను నేలమాళిగలో దాక్కున్నప్పుడు రాణి వంటి మీద ఉన్న నగలు.
ఆ తరువాత ఏమయ్యాయో తెలియదు. 
ఆ నగలు గనక దొరికితే తన మిగిలిన బతుకు వెళ్ళిపోతుంది.
 రాణీ స్నానానికి వెళ్ళినప్పుడు,నిద్ర పోతున్నప్పుడూ వెతుకుతూ ఉండేది నగల కోసం. 
విఫల ప్రయత్నాలు. 

తను చనిపోయాక రాజలాంఛనాలతో తన అంత్యక్రియలు జరగాలి.
వేలమందికి అన్నదానాలు జరగాలి. 
అందుకోసమే తన వజ్రాల నగలు దాచింది రాణి. 
తను చనిపోయే ముందు దాసిని పిలిచి నగలు చూపించి తన ఆఖరి కోరిక చెబుతుంది. 

కానీ ఒకానొక రోజు వర్షాల రోజుల్లో ఓ సాయంకాలం చీకటి వేళ  చనిపోయింది రాణి

ఈ పాట పాడుకుంటూను-

ఊరికి ఉత్తరాన సమాధిపురములో 
కట్టె ఇల్లున్నదే చిలుకా 
కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు 
కన్నా తల్లెవరే చిలుకా 
నువ్వు కాలి  పోయేదాక కావలుందురు గాని 
వెంటనెవరూ రారు చిలుకా    
        

పాట ఆగింది.  రాణి ఇక లేదు. 

 విగత జీవిగా ఉన్న రాణిని చూసిందిదాసి. 
  
తమ మధ్య ఉన్న ఒక తాడు ఏదో తెగిపోయింది. 

తరువాత రాణి గది అంతా వెదికింది, పూజా మందిరం  వెతికింది ఈమాటు ఇంకా సరిగ్గా. 
మందిరం అడుగున రహస్య సొరుగు కనిపెట్టింది. 
అందులో ఉన్నది నగల మూట!
మూట విప్పితే ధగధగలాడుతూ వజ్రాల నగలు. 
ఈ నగలే తన దగ్గర ఉంటే దూరంగా వెళ్ళిపోయి హాయిగా రాణిలా దర్జాగా బతికేది. 
దాసిలాగే బతుకంతా కరిగిపోయింది.   

ఒక్కో నగా తీసి పెట్టుకుంది దాసి.
అద్దంలో చూసుకుంది. 
మహారాణి కన్నా ఏం తక్కువ? తనను తన భర్త చిలకా అని పిలిచే వాడు. వన్నెల రాణీ అనేవాడు.
 ఆ మాటలు గుర్తున్నాయి గానీ భర్త మొహం జ్ఞాపకాల్లో మసకబారి పోయింది. 
నగలన్నీ పెట్టుకుని రాణి వంక చూసి గర్వంగా నవ్వింది.రాణి బతికి ఉండి తనను చూడగలిగితే?    

నగలన్నీ మళ్ళీ మూట కట్టింది. తన గదికి తీసుకుపోయి దాచి పెట్టింది. 
రేపు తెల్లవారాక అందరికీ చెప్పాలి రాణి ఇక లేదని.
ఇప్పుడు చిమ్మ చీకటి,తుఫాను రాత్రి. 
 నిద్ర పోయింది దాసి,భావి జీవితాన్ని కలలు కంటూ. 
ఇక మీదట తనకే ఓ దాసి,సొంత ఇల్లూ,కమ్మని భోజనం.       

బయట తుఫాను హెచ్చింది. 
దాసి ఉన్న గది కొండ రాళ్ళు కూలి నిద్రలోనే మరణించింది దాసి. 

తెల్లవారింది. 
తుఫాను ఆగింది.  
యథాప్రకారం కోతులు వచ్చాయి.
 శిథిలాల్లో తిరుగుతూ నగల మూట ఎత్తుకుపోయి ఎగురుకుంటూ వెళ్ళి   బావిలో పడేసాయి. 
వజ్రాల నగలన్నీ నీళ్ళ పాలయిపోయినాయి

 అప్పుడప్పుడూ అక్కడ ముసలి రాణి, ముసలి దాసి కనిపిస్తూ ఉంటారని,
ఏవో మాటలు,పాటలు,అరుపులు  వినిపిస్తుంటాయని చెప్పుకుంటుంటారు ప్రజలు.    
  
ఇప్పుడా శిథిలాల వైపుకు ఎవరూ వెళ్ళరు.
ఎందుకో మరి కోతులు కూడా.    


(Published in TANA Souvenir)

 



























ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన