ఆంధ్రభోజుడి దెబ్బకి తెలుగు మేధావి అబ్బా!
తెలుగు మేధావి: ఎన్నో భాషలు పోయాయి. అలాగే తెలుగు కూడా పోతే పోతుంది. అయితే ఏమిటిటా?
సామాన్యుడు: అయ్యో,అయ్యో ఏమిటండీ అంత మాటనేసారు?
తెలుగు మేధావి: ఎన్నో మతాలు పోయాయి. అలాగే మీ సనాతనం అంతా పోయి ప్రజలంతా వేరే వేరే మతాలు పుచ్చుకుంటే ఏమౌతుందిట?
సామాన్యుడు: అయ్యో,అయ్యో ఏమిటండీ అంత మాటనేసారు?
తెలుగు మేధావి: దేశం ముక్కలైతే అయిపోనివ్వండి. ఎవరికి నచ్చిన ముక్క వాళ్ళు పట్టుకుపోతే ఏమౌతుందిట?
సామాన్యుడు: అయ్యో,అయ్యో ఏమిటండీ అంత మాటనేసారు?
ఇదంతా స్వర్గం నుండి వింటున్న కృష్ణ దేవరాయల వారు దిగి వచ్చి, “ఏమిరా, నా సామ్రాజ్య పౌరుడికి ఇంత తెంపరితనమా? తలకు మాసిన మేధావీ! నీవు నా రాజ్యంలో ఉండతగవు” అంటూ నడ్డి మీద తన్నగానే ఆ మేధావి తన పుస్తకాలతో సహా డైబీరియా మంచు ఎడారిలోకి పోయి పడ్డాడు.
ఆహా! డైబీరియా! ఇక్కడ ప్రవాసం అంటే నాకు విప్లవ మేధావిగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు వచ్చేసినట్టే! హిప్! హిప్! హుర్రే! అంటూ డాన్సు చేయడం మొదలు పెట్టాడు.
రెండు నిమిషాల్లోనే ఒళ్ళు గడ్డకట్టే చలి పుడ్డడంతో, జేబులోంచి లైటరు తీసి తనలో మేధావిత్వాన్ని రగిలించిన ఆ పుస్తకాలకు నిప్పంటించి, అవి ఎర్రెర్రగా కాలుతుండగా బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు.