అద్యచ్చా! అద్యచ్చా! - 1
ఒకనాడు తాము పాలించిన తెలుగు రాజ్యం ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని శ్రీకృష్ణ దేవరాయలు, రాజరాజ నరేంద్రుడు తెలుగు నేల మీదకు దిగి వచ్చారు.
అలా కిందికి దిగారో లేదో సుశ్రావ్యమైన దూషణలు విన్పించగా ఇద్దరు ఒక్కసారి అద్దిరిపడ్డారు.
లుంగీ వూడదీసి తంతా!
చొక్కా విప్పించి తంతా!
నోర్ముయ్! బాంచత్!
తొడగొట్టి సవాల్!
నీ అంతు చూస్తా!
తిప్పించి తిప్పించి తంతా!
రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తా!
బస్తీ మే సవాల్!
డౌన్! డౌన్!
షేమ్! షేమ్!
ఏమిటయ్యా ఇదంతా?
ఎవరు వీరంతా?
చేపలమ్ము విపణి వీధా?
తిరునాళ్ళలో ఆకతాయిల సవాళ్ళా?
అని విస్తుపోతూ అడిగారు ఓ దారిన పోయే దానయ్యని.
వాళ్ళంతా తెలుగు ప్రజల నాయకులయ్యా.
అదేమిటి, అలాంటి భాష వాడుతున్నారు?
అలా మాట్లాడితేగానీ సమావేశం వాడిగా వేడిగా జరిగినట్టు కాదయ్యా.
ఒకళ్ళు చెప్పేది ఇంకోళ్ళు వినకుండా అరిచి అరిచి అరిచి ఇంటికి పోవడమే మా నాయకుల సమావేశాలంటే.
అది విని కృష్ణదేవరాయలు,రాజరాజ నరేంద్రుడు పళ్ళు పటపటలాడిస్తూ, తమ ఒరల్లోని ఖడ్గాలను పట్టి, ఏమీ చెయ్యలేక కుతకుతలాడారు.