అద్యచ్చా!అద్యచ్చా!-2
ఇంతలో అక్కడ కలకలం రేగింది.
స్త్రీలను ఉద్దేశించి భయంకరమైన తిట్లు వినిపించసాగినవి.
ఎవరయ్యా మహిళలను ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు?
వారంతా మా నాయకులు, వారి వందిమాగధులేనయ్యా.
అదేమిటీ? అంత దిగజారి మాట్లాడుతున్నారేమి?
ఈవిడ ఇదివరకు వీళ్ళ పార్టీకే పని చేసింది.
తరువాత ఎదుటి పార్టీలోకి వెళ్ళింది.
అందుకని బూతులు తిడుతూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారయ్యా.
ఆవిడేమో వీళ్ళ నాయకుడి మీద విమర్శలు చేసింది.
అందుకని బండ తిట్లతో శీల హననం చేస్తున్నారయ్యా.
అదిగదిగో, ఆవిడేమో వీళ్ళ నాయకుడి మీద ఆరోపణలు చేసింది.
అందుకని నోటికి వచ్చినట్టు ఆవిడ శీలాన్ని కించపరుస్తున్నారయ్యా.
ఛీ!ఛీ!
మహిళలను దుర్భాషలాడే వీళ్ళా తెలుగు ప్రజలకు నాయకులు? అంటూ చెవులు మూసుకున్నారు కృష్ణదేవ రాయలు, రాజ రాజ నరేంద్రుడు.
మరి, ఈ నాయకుల ఆడవారు రారా రాజకీయం చేయడానికి?
అని అడిగారు ఇద్దరూ ముక్త కంఠంతో.
అవసరమైతే వస్తారయ్యా.
వాళ్ళంతా సాధ్వీమణులని,భద్ర మహిళలని, పవిత్ర మూర్తులని, కర్తవ్యదీక్షా దక్షులని, కులస్త్రీలని,ఉత్తమ ఇల్లాళ్ళని, మాతృమూర్తులని, అమ్మల గన్న అమ్మలని, ముగురమ్మల మూలపుటమ్మలని, పూజనీయులని, మా నాయకుల వందిమాగధులు,
వారి చేతి కింది పెద్ద మనుషులు ప్రచారం చేస్తారు అన్నాడు దానయ్య.
ఈ ద్వంద్వనీతి విని కృష్ణదేవరాయలు,రాజరాజ నరేంద్రుడు పళ్ళు పటపటలాడిస్తూ, తమ ఒరల్లోని ఖడ్గాలను పట్టి, ఏమీ చెయ్యలేక కుతకుతలాడారు.