రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః 🚩
సాహితీ సభకు తన స్నేహితుడు రాముని వెంటబెట్టుకుని వచ్చాడు గోపాల్.
ఒక వక్త లేచి,
అసలు రామాయణం అంతా వ్యవసాయం గురించిన కతే అన్నాడు.
ఆ మాట విని రాము అదిరి పడ్డాడు.
ఆయన ఏమంటున్నాడు గోపాల్?
అన్నాడు అయోమయంగా.
ప్రజలకు ఆరాధనీయమైన ఇతిహాసాల మీద ఇలా ఎప్పటికప్పుడు వెర్రైటీ చూపులు కనిపెట్టడం వీళ్ళకు మామూలే అన్నాడు గోపాల్ నవ్వుతూ.
రామాయణంలో జనకుడు వ్యవసాయం చేసాడు. అప్పుడు సీత దొరికింది. అంటే పంట చేతికొచ్చింది.
అదేమిటి? జనకుడు మిథిలకు రాజు కదా. సంతానం కోసం యాగం చేస్తూ అందులో భాగంగా భూమిని దున్నబోతే సీత దొరికింది అన్నాడు రాము అయోమయంగా.
రాజైనా సరే వ్యవసాయమే చేసి బతికేవాడని ఈయన సిద్ధాంతం అన్నాడు గోపాల్ నవ్వుతూ.
రాముడు వ్యవసాయ యోగ్యమైన భూమిని కనిపెట్టడానికి సీతను తీసుకుని అడవికి బయల్దేరాడు.
ఏంటి గోపాల్ ఇతను చెప్పేది?
పట్టాభిషేకం మానుకుని రాజ కుమారుడు భార్యను తీసుకుని నార బట్టలు కట్టుకుని, పరివారాన్ని వదిలి నడుచుకుంటూ వ్యవసాయ యోగ్యమైన భూమిని కనుక్కోవడానికి బయల్దేరాడా?
హాస్యాస్పదంగా లేదూ?
ఈ వినే పెద్ద మనుషులంతా ఎలా వింటున్నారో?
అన్నాడు రాము అసహనంగా.
వాళ్ళంతా ఈ బాపతే. రంధ్రాన్వేషణమ్మ శిష్యులు. ఇతని మాటలకు ఎలా చప్పట్లు కొడుతున్నారో చూసావుగా అన్నాడు గోపాల్ నవ్వుతూ.
పంటను దొంగిలించిన మనిషి,అంటే సీతను దొంగిలించిన రావణుడి తో పంట కోసం ఫైటింగే రామాయణం.
ఏమిటి గోపాల్ ఇతని సృజనాత్మకత?
రావణాసురుడు రాజు కదా, అతనొచ్చి పంటను ఎత్తుకెళ్ళడమేమిటి?
అదంతే. గొప్ప నాగరికత అభివృద్ధి చెందిన రామాయణ కాలంనాటి మన సమాజాన్ని ఆటవిక సమాజంలా, అడవి జంతువుల స్థాయికి తీసుకెళ్ళి చెప్పడమే వీళ్ళ దృష్టిలో కొత్త దృష్టి.
వాల్మీకి రామాయణం చదివిన వాడు ఇలాంటి ఊహలు చెయ్యడు అన్నాడు గోపాల్ నవ్వుతూ.
ఉత్తర భారతదేశం నుండి దక్షిణానికి విస్తరించడానికి
ఆర్యులు చేసిన ప్రయత్నమే రామాయణం.
ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పని పరిశోధకులు నిరూపించారుగా గోపాల్?
ఇంకా ఆ మాటలే చెబుతాడే? అన్నాడు రాము.
ఆ సిద్ధాంతం లేకపోతే వీళ్ళకి చెప్పడానికి ఏమీ ఉండదు అన్నాడు గోపాల్ నవ్వుతూ.
దక్షిణాన్ని జయించడానికి వచ్చే వాళ్ళు సైన్యాన్ని వెంట బెట్టుకుని వస్తారుగానీ, నార బట్టలు కట్టుకుని భార్యని,తమ్ముడిని వెంటబెట్టుకుని నడుచుకుంటూ బయల్దేరుతారా? అన్నాడు రాము.
నిజమే అన్నాడు గోపాల్ నవ్వుతూ.
రాముడు కట్టిన సేతువు వ్యవసాయానికై నీళ్ళను నిలపడానికి కట్టిన ఆనకట్ట!
విన్నావా,రాము, వ్యవసాయం కోసం సముద్రం మీద ఆనకట్ట కట్టాడట రాముడు! అన్నాడు గోపాల్ విరగబడి నవ్వుతూ.
నిజమే, వ్యవసాయం కోసం సముద్రం మీద ఆనకట్టా?
అది సరే గానీ, ఇలాంటి వింత ఊహలు ఎందుకు చేస్తారంటావ్ వీళ్ళు?
ఏముంది రామూ, రామాయణం మీద భక్తి, గౌరవం,ఆరాధన, అభిమానం, ఆదర్శం పోగొట్టాలి. ప్రజలకు వారి మూలాల పట్ల, సంస్కృతి పట్ల చిన్న చూపు కలిగేలా చెయ్యాలి. ఇదే వీళ్ళ కొత్త చూపు వెనకాల అసలు చూపు అన్నాడు గోపాల్ నవ్వుతూ.
ఈయన మాటలను ఇక్కడ ఎవరో ఒకరు ఖండించరంటావా? అన్నాడు రాము బాధగా.
ఎవ్వరూ ఖండించరు!
చూడు, ఇప్పుడీ టుమ్రీలంతా జేజేలు కొడుతూ సన్మానం చేస్తారు! అన్నాడు గోపాల్ నవ్వుతూ.
నిజమే. వక్త గారికి ఘన సన్మానం జరిగింది. చివరిలో గజారోహణ సన్మానానికి ఏనుగు తెప్పించబడింది. అంతా కలిసి వక్తను ఏనుగు ఎక్కించారు.
ఇంతలో ఓ వింత జరిగింది.
ఆ ఏనుగుకు ఏమైందో ఏమో, వక్తను అంత ఎత్తునుండీ ఢామ్మని కింద పడేసి, అక్కడున్న టుమ్రీ గాళ్ళను తొక్కుకుంటూ వీథుల్లోకి పరుగులు తీసింది.