సభాపక్షులు
1. అందరికీ నమస్కారం. మీవంటి పెద్దల ముందు మాట్లాడేంత గొప్ప వాడిని కాదు. నేను చాలా చిన్న వాడిని. నేనొక శుంఠని. మీవంటి మహామహుల ముందు నిలబడే అర్హత నాకు లేదు.
2. ఈ వేదికను అలంకరించిన అధ్యక్షుడు పాపారావు గారికి, సెక్రెటరీ సుబ్బారావు గారికి,ఉపాధ్యక్షుడు ఎంకట్రావు గారికి, కమీటీ సభ్యులు విజయ లక్ష్మీ గారికి,పాపాయమ్మ గారికి, శివ వెంకట లక్ష్మీ నాగేశ్వరరావు గారికి…
3. ఇంతకు ముందు మాట్లాడిన కాజా రావు గారు నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేశారు. కాబట్టి ఇంక నేను చెప్పడానికి ఏమీ మిగల్లేదు.
4. ఇంతకు ముందు మాట్లాడిన చీమా రావు గారు తెలుగు వద్దు అని మంచి పాయింట్ చెప్పారు. నేను తెలుగు కావాలి అని చెబుతూ వారి మాటలతో ఏకీభవిస్తున్నాను.
5. ఇంతకు ముందు మాట్లాడిన గురివింద రావు గారి మాటలు విని నా శరీరం రోమాంచితమైంది, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి,గొంతు గద్గదమైంది. ఇప్పుడు నన్ను మాట్లాడమంటే నోట మాట రావడం లేదు.
6. “ద్రాక్ష తోటలోకి చెప్పవె రూటు” అన్న అద్భతమైన పాట మొదటిసారి వినగానే పరవశించా. అటువంటి వాక్యాలు రాయాలంటే పెట్టి పుట్టాలి. జయమాలినీ కటాక్షం ఉండాలి. ఇంకా వీరు “అత్తమ్మ కూతురికి అర ఎకరా రాసిస్తా“, “అబ్బా నీ జబ్బకు ఇస్తా రూకలు” లాంటి అద్భుతమైన పద ప్రయోగాలు ఎన్నో చేసారు. అసలు ఈ రోజుల్లో “ఎకరా” అంటే ఎంతమందికి తెలుసు? “రూక” అన్న పదం ఎప్పుడో పోయింది..