జాతి రత్నాలు!
ప్రకాశానికి సాహిత్యం అంటే ఇష్టం.
ఆ ఇష్టం ప్రకాశానికి తన తాత నుండి వచ్చింది.
ఒకసారి తాతను తీసుకుని ఓ సాహితీ సభకు వెళ్ళేడు.
మొదటి వక్త పైకి లేచి,
ఆనాడు భారత యూనియన్లో హైదరాబాదు విలీనం సందర్భంగా
మా వాళ్ళు చాలామంది పోయారు.ఎంతోమంది విదేశాలకు పారిపోయారు.
దీని మీద చరిత్ర తిరగేసి రాస్తున్నా.
అని కూర్చున్నాడు.
పోయింది, పారి పోయింది రజాకార్లు కదా?
మా వాళ్ళు అంటాడేమిటి?
సందేహంగా అడిగాడు తాతయ్య.
ఆ రజాకార్లంతా మావాళ్ళని
చెబుతున్నట్టున్నాడు తాతయ్యా, అన్నాడు ప్రకాశం.
రెండో వక్త పైకి లేచి,
తెలుగులో కొత్త సాంకేతిక పదాలను సృష్టిస్తే అది నేర్చుకునే వారికి అదనపు భారం.
ఇంగ్లీషులో పెద్ద పెద్ద సాంకేతిక పదాలను పసి పిల్లవాడు కూడా అర్థం చేసుకుంటాడు.
కాబట్టి తెలుగును కావాలంటే పుట్టు మచ్చల శాస్త్రం లాంటివి చదువుకోవడానికి వాడుకోండి.
మిగతా అన్ని ఆధునిక శాస్త్రాలు ఇంగ్లీషులోనే అందరూ చదివి తీరాలి
అని కూర్చున్నాడు.
అంటే, తెలుగు వాళ్ళు కొత్త పదాలను సృష్టించుకుని ఇతర అంతర్జాతీయ భాషలతో పోటీ పడరాదంటున్నాడా?
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండి పోవాలంటాడా ఈయన? అసహనంగా అడిగేడు తాతయ్య.
అంతే తాతయ్యా, తెలుగును మ్యూజియంలో పెట్టాలంటున్నాడు అన్నాడు ప్రకాశం.
మూడో వక్త పైకి లేచి,
వేరే మతాల వాళ్ళను కష్ట పెట్టకుండా, పాపం వారు ఇష్ట పడరు కాబట్టి మనం మన భాషనుండి రామాయణ,మహా భారతాదులన్నీ తీసెయ్యాలి.
భరత మాత, సరస్వతీ మాత, లక్ష్మీ దేవి ఇలాంటి మాటలు వేరే మతాలు పుచ్చుకున్న వాళ్ళు ఇష్ట పడరు కాబట్టి వాటిని భాషనుండి తీసెయ్యాలి
అని కూర్చున్నాడు.
పక్కనోడు అడ్డమొస్తున్నాయంటున్నాడని మన వేళ్ళని మనమే నరుక్కోవాలని చెబుతున్నట్టుంది ఈయన చెప్పేది అన్నాడు తాతయ్య మటమటలాడుతూ.
నాలుగో వక్త పైకి లేచి,
కడుపు నిండాక శిల్పం,రూపం ఇవన్నీ వస్తాయి కానీ అసలు మా వాదాలు చెప్పేది ఏదైనా కవిత్వమే. అని కూర్చున్నాడు.
శిల్పం,రూపం ఇవి లేకపోతే ఆ వచన కవిత్వం కేవలం వచనం అవుతుంది గానీ కవిత్వం ఎలా అవుతుందిరా అబ్బాయ్? అన్నాడు తాతయ్య నిరసనగా.
వాదాలు వాంతి చేసుకుంటే చాలు,
అదే కవిత్వం అని వక్కాణిస్తున్నాడు తాతయ్యా! అన్నాడు ప్రకాశం.
ఎవుర్రా నాయినా ఈ తింగరోళ్ళంతా? అన్నాడు తాతయ్య విసుగ్గా.
తింగరోళ్ళు కాదు తాతయ్యా, ఎజెండాతో మాట్లాడుతున్నారు.
ఇంతలో వక్తలందరికీ సన్మానం, “జాతి రత్న“ బిరుదు ప్రదానం జరుగుతుందని ప్రకటించారు నిర్వాహకులు.
విన్నావుగా తాతయ్యా, వీళ్ళంతా మన జాతి రత్నాలు!
అన్నాడు ప్రకాశం నవ్వుతూ.